సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌ అంటే ఇదేనా?

ముంబై : అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్‌ఎస్సీ) ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌కు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మహరాష్ట్ర ప్రభుత్వం మండి పడింది. దేశ ఆర్థిక రాజధానిగా పరిగణిస్తున్న ముంబై నుంచి ఐఎఫ్‌ఎస్సీని గుజరాత్‌కు  తరలించడం సరికాదని అభిప్రాయపడింది. 'సబ్ కా సాథ్... సబ్ కా వికాస్' అంటే ఇది కాదని విమర్శించింది. (చదవండి : కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం)




శనివారం శివసేన ఎంపీ అర్వింద్‌ సావంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధానిగా పరిగణించబడుతున్న ముంబై నుంచి ఐఎఫ్‌ఎస్సీని గుజరాత్‌కు తరలించడం సరైన నిర్ణయం కాదన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అనే మోదీ నినాదానికి వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. గుజరాత్ లో ఫైనాన్షియల్ సెంటర్ పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని... కానీ, మహారాష్ట్రకు ఇంకేం మిగిలిందనే విషయంపైనే తాము ఆందోళన చెందుతున్నామని సావంత్ చెప్పారు.